న్యూఢిల్లీ, మే 10: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
తమకు లీజుకు ఇచ్చిన విమానాల్ని లెస్సార్స్ స్వాధీనం చేసుకోకుండా మారటోరియం విధించాలని, స్వచ్ఛంద దివాలా ప్రక్రియను అనుమతించాలంటూ కొద్ది రోజుల క్రితం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద గో ఫస్ట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్పై రూలింగ్ను మే 4న ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ రిజర్వ్ చేసింది. గో ఫస్ట్ నడుపుతున్న 45 విమానాల్ని డీరిజిష్టర్ చేయాలంటూ లెస్సార్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను ఆశ్రయించిన తరుణంలో తాజాగా ఎన్సీఎల్టీ నిర్ణయం వెలువడింది.