న్యూఢిల్లీ, అక్టోబర్ 8: విదేశాల నుంచి దిగుమతయ్యే కార్లపై విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి దేశీయ కార్ల తయారీ సంస్థలు కోరుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ నుంచి దిగుమతయ్యే కార్లపై విధిస్తున్న పన్నును తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా పన్నులను తగ్గించాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం దిగుమతి అవుతున్న కార్లపై 60 శాతం నుంచి 100 శాతం దిగుమతి సుంకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ వసూలు చేస్తున్నది. దీంతో ఆయా కార్ల ధరలు రెండు రెట్ల వరకు అధికమవుతున్నాయి. భారత్లో అధిక పన్నులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో టెస్లా సంస్థ ఇక్కడ కార్లను విక్రయించడానికి వెనుకంజ వేస్తున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో దిగుమతి సుంకాన్ని 30 శాతానికి తగ్గించాలని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) కేంద్రాన్ని కోరుతున్నది.