ఈ ఏడాది ఆదాయంలో 25% వృద్ధి
2025 చివరి నాటికి రెట్టింపు ఆదాయం
ఫిక్కీ, యర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా
న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కాటుతో దారుణంగా కుదేలైన దేశీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ (వినోద) రంగం మళ్లీ గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ ఏడాది ఈ రంగం ఆదాయం 25 శాతం మేరకు వృద్ధి చెందుతుందని ఓ నివేదిక అభిప్రాయపడింది. 2025 సంవత్సరం నాటికి ఈ రంగం ఆదాయం రెట్టింపై రూ.2.68 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అయితే ఈ వృద్ధి వివిధ రంగాల రికవరీపై ఆధారపడి ఉంటుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2019లో రూ.1.82 లక్షల కోట్లుగా ఉన్న భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం ఆదాయం.. కొవిడ్-19 సంక్షోభం వల్ల గతేడాది దాదాపు 24 శాతం (రూ.43 వేల కోట్లు) క్షీణించి రూ.1.38 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇది 2017లో ఆర్జించిన ఆదాయానికి దాదాపు సరిసమానమని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ), అంతర్జాతీయ కన్సెల్టెన్సీ సంస్థ యర్నెస్ట్ అండ్ యంగ్ విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. 2020లో డిజిటల్, ఆన్లైన్ గేమింగ్ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో ఆదాయం క్షీణించడమే ఇందుకు కారణమని వెల్లడించింది. కానీ గతేడాది చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఈ రంగంలోని చాలా విభాగాల ఆదాయం మెరుగుపడిందని ఆ నివేదిక పేర్కొన్నది. దీంతో ఈ రంగం మొత్తం ఆదాయం ఈ ఏడాది 25 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు.. 2023 సంవత్సరం చివరి నాటికి మరో 13.7 శాతం వృద్ధితో రూ.2.23 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
కోలుకున్న మార్కెట్లు
ముంబై, మార్చి 26: స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో వరుస భారీ నష్టాలకు తెరపడింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 568.38 పాయింట్లు (1.17%) లాభపడి 49 వేలపైకి చేరుకున్నది. నిఫ్టీ 182.40 పాయింట్లు అందుకొని 14,507.30 వద్ద ముగిసింది. వారాంతం ట్రేడింగ్లో బజాజ్ ఫైనాన్స్ 4.49% పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. వీటితోపాటు ఏషియన్ పెయింట్స్, టైటాన్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, నెస్లెలు లాభపడ్డాయి. సైరస్ మిస్త్రీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో టాటా గ్రూపు షేర్లు కూడా దూసుకుపోయాయి.