న్యూఢిల్లీ, జనవరి 5: ఏడాది ఆరంభంలోనే జాబ్ మార్కెట్కు ఎదురుదెబ్బ. ఉద్యోగార్థులకు ఈ కొత్త సంవత్సరం కలిసొచ్చేలా కనిపించడం లేదు మరి. దేశీయ కార్పొరేట్ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో హైరింగ్పట్ల కంపెనీలు ఆచితూచి వ్యవహరించనున్నాయని గురువారం విడుదలైన ఓ తాజా సర్వేలో తేలింది. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం నిరుడుతో చూస్తే ఈ జనవరి-మార్చిలో నియామకాలు తగ్గుముఖం పట్టవచ్చని స్పష్టమవుతున్నది. ఈ సర్వేలో దాదాపు 3,030 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు పాల్గొన్నాయి. అయితే వీటిలో 48 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకుంటామని తెలిపాయి. అయినప్పటికీ 16 శాతం సంస్థలు గతంతో చూస్తే తక్కువగా నియామకాలు చేపట్టనున్నామని చెప్పగా, మరో 34 శాతం యాజమాన్యాలు నియామకాలకు విరామం ప్రకటించే వీలుందని పేర్కొన్నాయి. దీంతో నికర ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ 32 శాతంగానే నమోదైంది.
కొత్త నియామకాల జోలికి ఇప్పట్లో వెళ్లకూడదనే 33 శాతం కంపెనీల సీఈవోలు నిర్ణయించుకున్నట్టు మ్యాన్పవర్గ్రూప్ తాజా సర్వేలో తెలిపింది. దేశ జీడీపీ నికర వృద్ధి 7 శాతంగా ఉన్నా కొన్ని ఒడిదుడుకులు తప్పేలా లేవన్న అభిప్రాయాలు కార్పొరేట్లలో వ్యక్తమవుతున్నట్టు చెప్పింది. దీంతో అటు టెక్నాలజీ రంగం, ఇటు స్టార్టప్లు నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయన్నది. కాగా, ఐటీ, ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో 39 శాతం సంస్థలు ఆశాజనకంగా ఉన్నాయని, 37 శాతంతో కన్జ్యూమర్ గూడ్స్, సేవా రంగ కంపెనీలు తర్వాతి స్థానంలో ఉన్నట్టు ఈ సందర్భంగా సర్వే వెల్లడించింది.