Industrial Growth | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. ఫిబ్రవరి నెలకుగాను పారిశ్రామిక రంగంలో వృద్ధి 5.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తయారీ రంగంలో వృద్ధి 5.9 శాతం నుంచి 5 శాతానికి తగ్గడం వల్లనే వృద్ధి నెమ్మదించిందని తెలిపింది. అలాగే గనులు ఉత్పత్తిలో 8 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, పవర్ 7.5 శాతానికి పరిమితమైంది.
గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ధరల సూచీ ఎట్టకేలకు శాంతించింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ ఐదు నెలల కనిష్ఠానికి తాకుతూ 4.85 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరి నెలలో 5.09 శాతంగా ఉన్న ధరల సూచీ..ఏడాది క్రితం ఇదే నెలలో 5.66 శాతంగా నమోదైంది. అక్టోబర్ 2023లో నమోదైన 4.87 శాతం తర్వాత ఇదే కనిష్ఠం. ఆహారానికి సంబంధించిన ధరల సూచీ 8.66 శాతం నుంచి 8.52 శాతానికి తగ్గింది.