BJP Govt | న్యూఢిల్లీ, జనవరి 30: వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే మార్చి 31కల్లా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికి, అందులో సగం కూడా సేకరించడానికి ప్రభుత్వం నానా అగచాట్లు పడుతున్నది. ఇప్పటివరకూ రూ.10,051.73 కోట్లు మాత్రమే సమీకరించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) వెబ్సైట్ వెల్లడిస్తున్నది.
ఇందులో చాలావరకూ పీఎస్యూల పబ్లిక్ ఆఫర్ ద్వారా సమకూరినవే. 2022లో ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్లను ప్రైవేటుపరం చేసిన తర్వాత ఇప్పటివరకూ మరో పీఎస్యూను ప్రైవేటుకు విక్రయించలేకపోవడంతో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుంటుపడింది. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ తదితర కొన్ని పీఎస్యూలను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు ఫలించలేదు.
రెండు, మూడు కంపెనీల విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, యంత్రాంగపరమైన జాప్యాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు నెలల్లో సైతం పెద్ద మొత్తంలో డిజిన్వెస్ట్మెంట్ సొమ్ము సమకూరే అవకాశం లేదని డీబీఎస్ గ్రూప్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, హెచ్ఎల్ఎల్ లైఫ్, ఎన్ఎండీసీ స్టీల్ వ్యూహాత్మక వాటా విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేయాలన్న దూకుడును ప్రభుత్వం కనపర్చినప్పటికీ, ఇప్పటివరకూ వాటికి ప్రాధమిక బిడ్స్ను కూడా ఆహ్వానించలేదు. ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి 2023 జనవరిలోనే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ అందినప్పటికీ, బిడ్డర్లకు ఇంకా రిజర్వ్బ్యాంక్ అనుమతులు లభించలేదు. ఈ నేపథ్యంలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో ఏర్పడే లోటును ప్రభుత్వ కంపెనీలు ఇచ్చే డివిడెండ్లు, పన్ను వసూళ్లు సరిచేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.
వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని గత ఏడాది నిర్దేశించుకున్న రూ.51,000 కోట్లకంటే తగ్గించుకుంటుందని రాధికారావు అంచనా వేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), షిప్పింగ్ కార్పొరేషన్ (ఎస్సీఐ), కంటైనర్ కార్పొరేషన్ (కాంకర్)లను పూర్తి వ్యూహాత్మక వాటాను విక్రయించడానికి ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిందని, వీటి ప్రైవేటీకరణ లోక్సభ ఎన్నికల తర్వాతే జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, రైల్ వికాస్ నిగమ్, హడ్కో, ఎస్జీవీఎన్ల్లో కొద్దిపాటి వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం విక్రయించగలిగింది. వచ్చే ఆరు నెలల్లో డిజిన్వెస్ట్మెంట్, ప్రైవేటీకరణ అంశాల్ని ప్రభుత్వం పట్టించుకుపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. యంత్రాంగపరమైన సవాళ్ల కారణంగా జాప్యం జరుగుతుందని, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నందున ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని కంపెనీల డిజిన్వెస్ట్మెంట్ గడువులను మార్చవచ్చని ఆ వర్గాలు వివరించాయి.
ఒక వైపు పన్ను వసూళ్లు పెరగడం, మరోవైపు అధిక డివిడెండ్ ఆదాయం సమకూరడంతో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించ గలుగుతుంది. 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతం ఉంటుందని గత బడ్జెట్లో అంచనా వేసింది. 2025-26కల్లా దీనిని 4.5 శాతానికి పరిమితం చేయాలన్న రోడ్మ్యాప్ను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్మ్యాప్ ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది.
వచ్చే మధ్యంతర బడ్జెట్పై జెమ్స్, జ్యూవెల్లరీ ఇండస్ట్రీ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నారు. బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని(బీసీడీ) తగ్గించాలని, పన్నులను హేతుబద్దీకరించాల్సిన అవసరం ఉన్నదని ఆభరణాల వర్తకులు కోరుతున్నారు. దేశ జీడీపీలో 7 శాతం వాటా కలిగిన ఆభరణాల ఇండస్ట్రీ కస్టమ్స్ సుంకం అధికంగా ఉండటంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ముఖ్యంగా పాన్కార్డ్ ద్వారా జరిపే లావాదేవీల పరిమితిని పెంచాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సాయం మెహ్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే పాన్ కార్డు ద్వారా బంగారం కొనుగోళ్ల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ఆభరణాల వర్తకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిమితి విధించడంతో భారీ స్థాయిలో కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పాన్ కార్డ్ పరిమితిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు బంగారాన్ని పెట్టుబడి సాదనంగా చూస్తారని చెప్పారు. అలాగే నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)తో బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుత 2023-24ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్బ్యాంక్ నుంచి భారీ డివిడెండ్ అందుకున్న కేంద్ర ప్రభుత్వం మరో దఫా పెద్ద మొత్తాన్ని కేంద్ర బ్యాంక్ నుంచి అంచనా వేస్తున్నట్టు సమాచారం. వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, బ్యాంక్ల నుంచి రూ.70,000 కోట్ల డివిడెండ్ను లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 1న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఆర్బీఐ, జాతీయ బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్ లక్ష్యాన్ని నిర్దేశించగా అంతకు రెట్టింపునకు పైగా ఆయా సంస్థల నుంచి కేంద్ర ఖజానాకు సమకూరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్బ్యాంక్ రూ.87,416 కోట్లు మిగులు మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్రానికి బదిలీ చేయగా, బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రూ. 30,307 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. అంతేకాకుండాప్రభుత్వ రంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో మంచి ఆర్థిక ఫలితాల్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ, బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి రూ.70,000 కోట్ల డివిడెండ్ను అంచనా వేయడం సహేతుకంగా ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. 2022-23లో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి రూ. 40,953 కోట్ల డివిడెండ్ను స్వీకరించింది. దానికి 17 శాతం అధికంగా 2023-24లో 48,000 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్లో నిర్దేశించగా, రూ.1.17 లక్షల కోట్ల వరకూ డివిడెండ్ను అందుకుంది.