న్యూఢిల్లీ, మే 4: పసిడి రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని అమెరికా ఫెడరల్ రిజర్వు స్పష్టంచేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. రూ.940 పెరిగిన తులం బంగారం ధర రూ.62 వేలు అధిగమించి రూ.62,020 వద్ద ముగిసింది.
పసిడితోపాటు వెండి కూడా రూ.660 అధికమై రూ.76,700 పలికింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 పెరిగి రూ.62,180కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.500 అధికమై రూ.57 వేలు పలికింది. వెయ్యి రూపాయలు అధికమైన కిలో వెండి రూ.82,800కి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,060 డాలర్లకు, వెండి 25.50 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా రికార్డు స్థాయికి పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.