దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గిపోతున్నది.ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 7 శాతానికే పరిమితమవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం కీలకమైన గనులు, తయారీ రంగాల్లో స్తబ్ధత నెలకొన్నదని స్పష్టంగా తెలుస్తున్నది.
న్యూఢిల్లీ, జనవరి 6: ‘కరోనా ప్రభావం తగ్గింది. కీలక రంగాలన్నీ కోలుకున్నాయి. మార్కెట్ కార్యకలాపాలు.. లావాదేవీలూ ఊపందుకున్నాయి. ఇక దేశం ప్రగతిపథంలో దూసుకుపోతుంది.’ ఇదీ.. కేంద్రంలోని నరేం ద్ర మోదీ సర్కారు సమ యం దొరికినప్పుడల్లా చెప్తున్న మాటలు. అయితే వాస్తవం మాత్రం నివురుగప్పిన నిప్పులా మరోలా ఉన్నది. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీ వృద్ధి 7 శాతానికే పరిమితం కావచ్చని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన తాజా అంచనానే. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇది 8.7 శాతంగా ఉండటం గమనార్హం. నిజానికి 2022-23లో కరోనాసహా అన్ని ప్రతికూల పరిస్థితులు దాదాపు మెరుగయ్యాయి. అయితే అందు కు తగ్గట్టు ఆయా రంగాలకు ప్రభుత్వ దన్ను లభించకపోవడం వల్లే ఈ వృద్ధి కోతలన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గనులు, తయారీ రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే వృద్ధిరేటు అంచనాల తగ్గింపునకు కారణమని కేంద్రం కూడా చెప్తున్నది మరి.
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) జాతీయ ఆదాయం తొలి ముందస్తు అంచనాలను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తయారీ రంగం ఉత్పాదకత 1.6 శాతానికి పడిపోవచ్చని పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి ఏకంగా 9.9 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే గనుల రంగం వృద్ధిరేటు అంచనా గతంతో చూస్తే 11.5 శాతం నుంచి 2.4 శాతానికి దిగొచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి జీడీపీ 7 శాతానికి తగ్గిపోవచ్చని చెప్పింది. ఇక 2011-12 ధరల ప్రకారం దేశ జీడీపీ 2022-23లో రూ.157.6 లక్షల కోట్లుగా ఉంటుందని ఎన్ఎస్వో తాజాగా అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం మాత్రం రూ.273.08 లక్షల కోట్లుగా పేర్కొన్నది. కాగా, వ్యవసాయ రంగం వృద్ధి క్రిందటిసారితో పోల్చితే ఈసారి 3 శాతం నుంచి 3.5 శాతానికి పెరగవచ్చన్న ఎన్ఎస్వో.. నిర్మాణ రంగ వృద్ధిరేటు 9.1 శాతానికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి 7.9 శాతానికి దిగజారవచ్చని వెల్లడించింది.
కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ సర్కారు లక్షల కోట్ల రూపాయల ఉద్దీపనల్ని ప్రకటించినది తెలిసిందే. అయినప్పటికీ వృద్ధి అంచనాల్లో కోతలు పడుతుండటం.. ఈ ప్యాకేజీల అమలు తీరుకు అద్దం పడుతున్నది. 2020లో వచ్చిపడిన లాక్డౌన్ల నేపథ్యంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల ఉద్దీపనల్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఎన్నో ఇస్తున్నామని చెప్పింది. అయితే ఇవేవి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వలేకపోయాయని ఇప్పుడు తెలియవస్తున్నది. దీంతో జీడీపీలో కీలకమైన గనులు, తయారీ రంగాలను చిన్నచూపు చూడవద్దని, ఇకనైనా వీటి పురోగతికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారిప్పుడు.