భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారిపోతున్నట్టు ఆర్థిక సర్వే బయటపెట్టింది. పట్టు తప్పుతున్నదని, కట్టు వీడుతున్నదని అది హెచ్చరికలు పంపింది. గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ నిర్వాకం దేశ ఆర్థిక రంగాన్ని నష్టాల అంచుల్లో నిలబెడుతున్నట్టు విస్పష్టంగా సూచించింది. 2022-23 ఆర్థిక సర్వేను మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు ఎంత దాచాలని ప్రయత్నించినా ఇందులో చేదు వాస్తవాలను దాచలేకపోయింది. దేశ వృద్ధిరేటు నిరుడు కంటే ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత పతనం కాబోతున్నదని సర్వే చెప్పింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన ధరలు మరింత పెరిగి దేశ ప్రజలను ఇంకా ఆగమాగం చేయనున్నాయని పేర్కొంది. అంకెల గారడి, అబద్ధాల పేరడితో ఈ నిజాలను దాచటానికి ప్రయత్నించిన మోదీ ప్రభుత్వం.. రాబోయే కష్టాలకు ప్రపంచవ్యాప్త పరిణామాలే కారణమని ముందే ఒక సాకును వెతుక్కున్నది. ఎప్పుడోపోయిన కరోనాను, రేపు రాబోయే మాంద్యాన్ని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సంక్షోభిత వాతావరణ పరిస్థితులను చూపిస్తూ జరుగబోయేదానికి తన బాధ్యత ఏమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆర్థిక సర్వే ముఖ్యాంశాలివి..