ముంబై, అక్టోబర్ 16: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజూ కూడా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధర రాకెట్ వేగంతో దూసుకుపోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో 240 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 115.81 పాయింట్లు నష్టపోయి 66,166.93 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ కూడా 19.30 పాయింట్లు తగ్గి 19,731.75 వద్ద నిలిచింది. నెస్లె, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్లు భారీగా నష్టపోయాయి.
కానీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మహీంద్రాఅండ్ మహీంద్రాలు లాభపడ్డాయి. మార్కెట్లు వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చాయి..ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగగా, మెటల్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్ కాస్త లాభపడటంతో భారీ నష్టాల నుంచి గట్టెక్కగలిగిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రంగాలవారీగా చూస్తే టెలికం, రియల్టీ, టెక్, ఎఫ్ఎంసీజీ, సేవలు, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు నష్టపోగా..కమోడిటీస్, కన్జ్యూమర్, ఎనర్జీ, ఇండస్ట్రియల్స్, ఆటో, మెటల్ రంగ సూచీలు లాభపడ్డాయి.