న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశీయ ప్యాసింజర్ వెహికిల్ హోల్సేల్ అమ్మకాలు పరుగులు పెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) జూలై-సెప్టెంబర్లో మునుపెన్నడూ లేనివిధంగా నమోదయ్యాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సోమవారం తెలిపిన వివరాల ప్రకారం గత నెల సెప్టెంబర్ ఆఖరుతో ముగిసిన మూడు నెలల కాలంలో ఆయా ఆటో రంగ సంస్థల నుంచి డీలర్లకు 10,74,189 యూనిట్లు వెళ్లినట్టు తేలింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే త్రైమాసికంలో 10,26, 309 యూనిట్లుగా ఉన్నట్టు స్పష్టం చేసింది. దీంతో 4.7 శాతం వృద్ధి నమోదైనైట్టెంది. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్కు పెరిగిన డిమాండే కారణమని పేర్కొన్నది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లోనూ ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ అమ్మకాలు రికార్డును సృష్టించాయి. తొలిసారి 20 లక్షల మార్కును అధిగమించడం గమనార్హం. గతంలో ఎప్పుడూ 6 నెలల్లో ఈ స్థాయిలో టోకు విక్రయాలు నమోదు కాలేదు. ఈసారి 20,70,163 యూనిట్లుగా ఉన్నాయి. పోయినసారి 19,36,804 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ తెలిపింది.
ప్రారంభస్థాయి వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పడిపోతున్నదని సియామ్ తెలియజేసింది. ఎంట్రీ లెవల్ కార్ హోల్సేల్ అమ్మకాలు ఈ జూలై-సెప్టెంబర్లో 35,000 యూనిట్లుగా ఉన్నాయి. అదే 2018-19 జూలై-సెప్టెంబర్లో 1.38 లక్షలుగా ఉన్నట్టు సియామ్ గుర్తుచేసింది. ఇక ఈ జూలై-సెప్టెంబర్లో ఎంట్రీ లెవల్ టూవీలర్ వాహన హోల్సేల్ విక్రయాల్లోనూ తగ్గుదల కనిపించిందని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డిమాండ్ పుంజుకోకపోవడమే కారణంగా అభివర్ణించింది. అయితే ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్, కమర్షియల్ వెహికిల్ సేల్స్లో వృద్ధి క్రమేణా పెరుగుతున్నట్టు సియామ్ ఈ సందర్భంగా పేర్కొన్నది.
ప్యాసింజర్ వాహన విభాగంలో ఈ రికార్డు అమ్మకాల వృద్ధి.. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు ఏర్పడిన భారీ డిమాండ్తోనే సాధ్యమైంది. ప్రస్తుతం మొత్తం వాహన విక్రయాల్లో యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల వాటానే దాదాపు
60 శాతంగా ఉంటున్నది. ఈ పండుగ సీజన్తో ప్రస్తుత అక్టోబర్-డిసెంబర్లో వాహన విక్రయాలు మరింత పెరుగవచ్చు. ఇదే జరిగితే దేశ ఆర్థిక వృద్ధికి అవి దోహదపడుతాయి.