ముంబై, జనవరి 25: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వితరణకు తగిన నగదు నిల్వలు లేక అల్లాడుతున్నది. జీఎస్టీ, అడ్వాన్సు టాక్స్ చెల్లింపుల ఫలితంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నగదు తరలివెళ్లింది. దీంతో జనవరి 24నాటికి మొత్తం దేశీయ బ్యాంక్ల్లో రూ.3.5 లక్షల కోట్ల లిక్విడిటీ (ద్రవ్యత) కొరత ఏర్పడిందని విశ్లేషకులు తెలిపారు.
ఈ తరుగుదల 14 ఏండ్ల గరిష్ఠం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు తగినంత నగదు ఉండేలా పలు సాధనాలతో మనీ మార్కెట్లో రిజర్వ్బ్యాంక్ జోక్యం చేసుకుంటున్నప్పటికీ, రోజురోజుకీ కొరత పెరిగిపోయింది. జనవరి 23న రూ.3.34 లక్షల కోట్లు ఉన్న కొరత 24కల్లా రూ.3.5 లక్షల కోట్లకు చేరిపోయింది. మనీ మార్కెట్లో స్వల్పకాలిక అవసరాలున్న బ్యాంక్లు తీసుకోవడం, మిగులు ఉన్న బ్యాంక్లు విక్రయించడం చేస్తుంటాయి. వీటిపై కొద్దిపాటి వడ్డీ రేటు ఉంటుంది.
14 ఏండ్ల గరిష్ఠానికి కొరత.. ఎందుకు?
కొద్ది రోజుల క్రితం నుంచి పండుగ సీజన్లో క్రమేపీ కరెన్సీ విత్డ్రాయిల్స్ జరగడం, కార్పొరేట్లు, హెచ్ఎన్ఐలు వారి ఖాతాల నుంచి అడ్వాన్సు టాక్స్కు చెల్లింపులు జరపడం ఒక కారణమైతే జనవరి 20న వస్తుసేవల పన్ను చెల్లింపులతో భారీగా నగదు తరలివెళ్లింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తక్కువ వ్యయం చేయడంతో వ్యవస్థలోకి తగినంత నగదు సరఫరా జరగలేదని మనీ మార్కెట్ నిపుణులు తెలిపారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం జీఎస్టీ చెల్లింపులకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.1 లక్ష కోట్లు తరలిపోయాయి.
అధిక స్థాయిలోనే వడ్డీ రేట్లు
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ కొరత కారణంగా కాల్ మనీ, వాణిజ్య పత్రాలు, డిపాజిట్లులతో సహా అన్ని సాధనాలపై స్వల్పకాలిక రేట్లు పెరుగుతాయి. కాల్మనీ మార్కెట్లో సగటు రేటు జనవరి 24న 6.83 శాతం ఉండగా, అది 25న 6.8565 వద్దకు పెరిగిపోయింది. ఇటీవల కొన్ని బ్యాంక్లు డిపాజిట్ల రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. అలాగే రుణాలపై వడ్డీ రేట్లను కూడా అధికం చేస్తాయి.
వాస్తవానికి ఆర్బీఐ తాను గతంలో పెంచిన రేట్లకు అనుగుణంగా బ్యాంకులు రేట్లను సర్దుబాటు చేయలేదన్న భావనతోనే ఎప్పటికప్పుడు వ్యవస్థలో లిక్విడిటీని కట్టడి చేస్తున్నదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం అయినందున ద్రవ్యోల్బణం పెరగకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని ఆర్బీఐ మేనేజ్ చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దికాలం గరిష్ఠస్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగుతాయని వివరించారు.
వీఆర్ఆర్ వేలం ద్వారా నగదు
బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు పెరిగిపోయిన సమయంలో దానిని తీసుకోవడం, కొరత ఏర్పడినపుడు తగినంతగా అందచేయడానికి వీఆర్ఆర్ (వేరియబుల్ రెపో రేటు) వేలాల్ని ఆర్బీఐ నిర్వహిస్తుంది. నగదు అవసరమైన బ్యాంక్లు ఈ వేలంలో పాల్గొంటాయి. ఆర్బీఐ ప్రస్తుత రెపో రేటు 6.5 శాతానికంటే మించి ఒక కటాఫ్ రేటును నిర్ణయిస్తుంది. ఈ కటాఫ్కంటే ఎక్కువ రేటును బ్యాంక్లు కోట్ చేయాల్సి ఉంటుంది.
జనవరి 25న రూ.2,50,010 కోట్లను ఇచ్చేందుకు 6.72 కటాఫ్ రేటుతో 15 రోజుల వీఆర్ఆర్ వేలాన్ని నిర్వహించగా, బ్యాంక్లు రూ.3,08,024 కోట్ల విలువైన బిడ్స్ సమర్పించాయి. ఈ వేలంలో పొందిన డబ్బును తిరిగి 15 రోజుల్లో బ్యాంక్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఒక రోజు అవసరాల కోసం నగదు తీసుకునేందుకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) అనే ఆర్బీఐ లిక్విడిటీ విండో కూడా బ్యాంక్లకు అందుబాటులో ఉంటుంది.