IDBI | న్యూఢిల్లీ, మార్చి 17: ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడిందంటూ మీడియా కథనాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కొట్టివేసింది. ‘ ఈ లావాదేవీ ట్రాక్లోనే ఉన్నది. పలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ (ఈవోఐలు) అందిన తర్వాత జరిగే ప్రక్రియ కొనసాగుతున్నది’ అంటూ దీపం కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం ట్వీట్ చేశారు.
ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం, ఎల్ఐసీ కలిసి 61 శాతం వాటాను విక్రయిస్తుండగా, ఇందుకు ఈ ఏడాది జనవరిలో ఈవోఐలు అందాయి. కేంద్రం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాల్ని విక్రయించడానికి నిరుడు అక్టోబర్లో దీపం ఈవోఐలను ఆహ్వానించింది. ఈ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీలకు కలిపి 94.72 శాతం వాటా ఉంది.