Gautham Adani | ముకేశ్ అంబానీ.. గౌతం అదానీ.. భారత్లోని అగ్రశ్రేణి కుబేరులు. ఇద్దరి వ్యక్తిగత సంపద మధ్య తేడా కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా టాప్-100 కుబేరుల్లో గౌతం అదానీ మొదటి వరుసలో ఉంటే తర్వాత ముకేశ్ అంబానీ నిలిచారు. ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన కార్పొరేట్ సంస్థ అధినేతగా గౌతం అదానీ నిలిచారు. అదానీ, అంబానీ మినహా ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ సంపద మాత్రమే పెరిగింది. ఈ ఏడాదిలో ఆయన 3.89 బిలియన్ల డాలర్లు సంపాదించారు. అంబానీ 4.24 బిలియన్ల డాలర్లు పెరిగితే, గౌతం అదానీ సంపద 13 బిలియన్ల డాలర్లకు దూసుకెళ్లింది. వరుసగా నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతూ వస్తున్నాయి. గురువారం ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద రూ.7.01 లక్షల కోట్లు కాగా, గౌతం అదానీ ఆస్తులు రూ.6.66 లక్షల కోట్లు.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్కు గౌతం అదానీ సారధ్యం వహిస్తున్నారు. ఇద్దరి ఆస్తులు గత నవంబర్ 21న సమం అయ్యాయి. గతేడాది (2021) నవంబర్ 21న ఇద్దరి వ్యక్తిగత సంపద రూ.6.63-6.63 లక్షల కోట్లుగా నిలిచింది. నాడు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.91 లక్షల కోట్లు. అదానీ గ్రూప్ ఎం-క్యాప్ రూ.10 లక్షల కోట్లు.
ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16.77 లక్షల కోట్లకు చేరుకున్నది. అదానీ గ్రూప్ ఎం-క్యాప్ రూ.11.16 లక్షల కోట్లుగా స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలైన ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇది. తొలిసారి అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11.10 లక్షల కోట్లు దాటింది. అదానీ గ్రూప్లో అత్యధికంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ఎం-క్యాప్ రూ.3 లక్షల కోట్లుగా ఉంది.
అదానీ గ్రూప్ అనుబంధ మూడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల పై చిలుకే. అదానీ ట్రాన్స్మిషన్ రూ.2.21 లక్షల కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ ఎం-క్యాప్ రూ.2 లక్షల కోట్లు దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముకేశ్ అంబానీకి 50.61 శాతం వాటా ఉంటే, అదానీ గ్రూప్ సంస్థల్లో గౌతం అదానీకి 70.59 శాతం వాటా ఉంది. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో ఒకదాంట్లో 74.80 శాతం, మరో రెండు సంస్థల్లో 60-64 శాతం వాటాలు ఉన్నాయి.
గత శుక్రవారం (జనవరి 14) నుంచి గౌతం అదానీ ర్యాంక్ మెరుగవుతున్నది. గ్లోబల్ టాప్-10 కుబేరుల్లో ఇండియన్స్ లేరు. ముకేశ్ అంబానీ 11వ ర్యాంక్, గౌతం అదానీ 12వ ర్యాంక్లో ఉన్నారు. ఇద్దరి వ్యక్తిగత ఆస్తిలో తేడా డాలర్లలో సుమారు 500 కోట్ల డాలర్లు. జనవరి 14న ఇద్దరి మధ్య తేడా 9.5 బిలియన్ల డాలర్లు. ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు శరవేగంగా పుంజుకున్నాయి.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ సంపద రూ.31,592 కోట్లు పెరిగింది. గౌతం అదానీ వ్యక్తిగత సంపద రూ.96,863 కోట్లు ఎగిసింది. అంబానీ.. అదానీ ఇద్దరూ గుజరాత్లో భారీగా పెట్టుబడులు పెడతామని ఇటీవలే ప్రకటించారు. వచ్చే 10-15 ఏండ్లలో గుజరాత్లోని గ్రీన్ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల్లో రూ.5.95 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపారు. జియో, రిటైల్తోపాటు ఇతర సెగ్మెంట్లపైనా ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు గుజరాత్లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియా కంపెనీ పోస్కోతో రూ.40 వేల కోట్ల ఒప్పందంపై అదానీ గ్రూప్ సంతకాలు చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్న టాప్12 కుబేరులలో అదానీ, అంబానీ ఉన్నారు.