న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్) దాఖలుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు సెప్టెంబర్ 30 వరకూ ఉన్న గడువును డిసెంబర్ 31కి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఐటీ రిటర్న్లు ఫైల్ చేసేందుకు గడువుతేదీ 2021 జూలై 31కాగా, దానిని గతంలో సెప్టెంబర్ 30 వరకూ పెంచిన కేంద్రం మరోదఫా మూడునెలలు పొడిగించింది. ఇన్కమ్ట్యాక్స్ ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్లో పలు సమస్యలు తలెత్తిన నేపథ్యంలో డిసెంబర్ నెలాకరువరకూ గడువు పెంచడం గమనార్హం. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది కూడా ఐటీ రిటర్న్ల గడువును కేంద్రం నాలుగు దఫాలు పెంచింది. అలాగే కంపెనీలు ఐటీఆర్లు దాఖలు చేసేందుకు గడువును 2021 నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15 వరకూ పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) తెలిపింది. రివైజ్డ్ రిటర్న్ సమర్పణకు మరో రెండు నెలలపాటు 2022 మార్చి 31వరకూ పెంచారు.