న్యూఢిల్లీ, మార్చి 31: పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఫిబ్రవరి చివరికల్లా 82.8 శాతానికి చేరింది. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్యకాలంలో ద్రవ్యలోటు రూ.14.53 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కేంద్ర ప్రభుత్వ వ్యయం, రెవిన్యూ వసూళ్ల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.17.55 లక్షల కోట్లు ఉంటుందని కేంద్రం గత ఏడాది బడ్జెట్లో అంచనా వేసింది. ఇది జీడీపీలో 6.4 శాతం. సవరించిన ద్రవ్యలోటు అంచనా రూ.17.6 లక్షల కోట్లు మరింత భారీగా పెరిగే అవకాశాలు లేవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థలు నుంచి పొందిన డివిడెండ్లు, పీఎస్యూల వాటా విక్రయాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.94,282 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం సవరించిన బడ్జెట్ అంచనా రూ.93,000 కోట్లకంటే ఎక్కువే. పీఎస్యూల నుంచి రూ.58,988.34 కోట్లు డివిడెండ్ల చెల్లింపుతో ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. ఇక ఎల్ఐసీతో సహా వివిధ ప్రభుత్వ సంస్థల వాటాల్ని విక్రయించడంతో రూ. 35,293.52 కోట్లు వచ్చాయి.