సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ ఆధారిత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వేదిక అసెట్మాంక్.. ఈ ఏడాది ఆఖరుకల్లా తమ నిర్వహణలోని ఆస్తులను రూ.500 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు అసెట్మాంక్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీవోవో పృథ్వీ చింతా సోమవారం తెలియజేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలోని పెట్టుబడులు రూ.120 కోట్లను దాటాయి. ఈ క్రమంలో సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ నాటికి రూ.500 కోట్లకు చేర్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందుకు తగ్గట్టే త్వరలో పుణె, ముంబై, ఢిల్లీ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నది. సంప్రదాయక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధునిక దృక్పథంతో పునరావిష్కరించడమే తమ సంస్థ ముఖ్యోద్దేశమని పృథ్వీ అంటున్నారు. ఆఫీస్ స్పేస్తోపాటు కో-లివింగ్ వంటి వాటిని మదుపరులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ వేదికపైకి ఒక ఆస్తిని తీసుకువచ్చే ముందు 80 రకాలుగా పరిశీలన చేస్తామని, మదుపరుల ప్రయోజనాలు కాపాడే పారదర్శకమైన, భద్రమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్గా అసెట్మాంక్ వ్యవహరిస్తుందని చెప్పారు. కనిష్ఠంగా రూ.10 లక్షల నుంచే పెట్టుబడికి అవకాశాల్ని కల్పిస్తున్న ఈ సంస్థ.. బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల మదుపరుల విశ్వాసాన్నీ చూరగొన్నది.