Salary Increment | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశంలో ఈ ఏడాది ఉద్యోగుల జీతాల వార్షిక పెరుగుదల ఏక అంకెకే పరిమితం కానుంది. అంతేకాకుండా గత ఏడాది కంటే వేతనాల పెంపును కంపెనీలు స్వల్పంగా తగ్గించనున్నాయి. 2023లో 9.7 శాతం ఇంక్రిమెంటల్ సేలరీ అందుకున్న ఉద్యోగులకు 2024లో సగటు పెంపు 9.5 శాతం ఉంటుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయాన్ వెల్లడించింది.
కొవిడ్ పాండమిక్ తర్వాత 2022లో భారీ ఇంక్రిమెంట్లు ఉద్యోగులకు లభించినప్పటికీ, 2023-24 సంవత్సరానికి దాదాపు 45 పరిశ్రమల్లో 1,414 కంపెనీల టర్నోవర్, వేతనాల పెంపుపై అయాన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేను విశ్లేషించిన అయాన్.. భారత్లో వేతన పెంపుదల హై సింగిల్ డిజిట్ వద్ద స్థిరపడినట్టు పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకి ఇండియాలో వేతనాల పెంపు అధికంగా ఉన్నదని తెలిపింది.
జీతాల పెంపులో భారత్ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ (7.3 శాతం), ఇండోనేషియా (6.5 శాతం) లు నిలిచాయి. ఉద్యోగుల వలసలు తగ్గాయని, 2022లో అత్యధికస్థాయిలో 21.4 శాతం మేర ఉన్న వలసల రేటు 2023లో 18.7 శాతానికి తగ్గిందని, దీంతో జాబ్ మార్కెట్ కాంపిటీటివ్గా మారిందని అయాన్ సర్వే పేర్కొంది. వలసల రేటు తగ్గడంతో ఉద్యోగుల సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి నిలిపాయన్నది.
2023లో కంపెనీలు సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని, హై సింగిల్ డిజిట్లో వేతనాల్ని పెంచగలిగాయని అయాన్ తెలిపింది. గ్లోబల్ సెంటిమెంట్ అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో మౌలిక వసతులు, తయారీ వంటి రంగాలు మంచి వృద్ధిని కనపరుస్తున్నాయని, ఆయా రంగాల్లో అధిక పెట్టుబడులు జరుగుతాయని అయాన్ టాలెంట్ సొల్యూషన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రూపాంక్ చౌదరి చెప్పారు.