హైదరాబాద్, అక్టోబర్ 6: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ పీట్రాన్..హైదరాబాద్లో ఉన్న ప్లాంట్ను విస్తరిస్తున్నది. ప్రస్తుతం నాచారం వద్ద 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ యూనిట్ను 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచుతున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో అమీన్ ఖవాజా తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 350 ఉద్యోగులు పనిచేస్తుండగా, వచ్చే ఏడాదికాలంలో ఈ సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు చెప్పారు.
వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల్లో రూ.30 కోట్లను పెట్టుబడిదారుల నుంచి సేకరించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పటికే సంస్థ రూ.47 కోట్ల నిధులను సమీకరించింది. నగరంలో ఏర్పాటు చేసిన యూనిట్లో పీసీవీఎస్, ప్లాస్టిక్ శెల్స్ను ఉత్పత్తి చేయబోతున్నది. ప్రస్తుత పండుగసీజన్ను దృష్టిలో పెట్టుకొని పలు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రూ.499కే బాస్బడ్స్ డ్యూను అందిస్తున్నది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.147 కోట్లుగా ఉన్న టర్నోవర్ ఈ ఏడాది రూ.220 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.