న్యూయార్క్, జూన్ 21: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు. ‘భారత్లో టెస్లా పెట్టుబడులు పెడుతుంది. వీలైనంత త్వరగా ఇది కార్యరూపం దాల్చుతుందని విశ్వసిస్తున్నాను’ అని మస్క్ అన్నారు.
భారత్కు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నిజానికి గతంలో భారత్కు టెస్లా రాకపట్ల మస్క్ స్పందించిన విషయం తెలిసిందే. భారీ ప్రోత్సాహకాలు ఇస్తే తప్పక వస్తామని ప్రకటించిన సంగతీ విదితమే. ఆ తర్వాత ఈ అంశానికి మస్క్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అంతా మర్చిపోయారు. కాగా, ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా అధిపతి మస్క్తో ఆయన సమావేశమయ్యారు.