Tesla EV Cars | భారత్లో మాన్యుఫాక్చరింగ్ బేస్ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ `టెస్లా ఇంక్ (Tesla Inc)` సీరియస్గా పరిశీలిస్తున్నదని కేంద్ర టెక్నాలజీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. టెస్లా ప్రతినిధి బృందంతో భేటీ తర్వాత రాజీవ్ చంద్రశేఖర్.. ప్రముఖ వార్తా సంస్థకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్లో కార్లు, బ్యాటరీ తయారీకి ఇన్సెంటివ్లతోపాటు పలు అంశాలపై టెస్లా ప్రతినిధి బృందం.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపింది. భారత్ మార్కెట్లోకి ఎంటర్ కావాలని టెస్లా ఆసక్తితో ఉందని గురువారం వార్తలొచ్చాయి.
`భారత్లో కార్ల తయారీ, ఇన్నోవేషన్ బేస్ ఏర్పాటు చేసుకునే విషయమై వారు (టెస్లా) చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు` అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వారి (టెస్లా) ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి పని చేసేందుకు భారత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చినట్లు చెప్పారు. భారత్లో పెట్టుబడులతో విజయవంతం కావాలని టెస్లా ఆకాంక్షిస్తున్నదని పేర్కొన్నారు. భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) నిర్మాణానికి ఫ్యాక్టరీ, ఈవీ బ్యాటరీల తయారీ సంస్థ ఏర్పాటు చేస్తామని టెస్లా ప్రతిపాదించినట్లు రాయిటర్స్ వార్తాకథనం.
కేవలం వాహనాల తయారీకి మాత్రమే పరిమితం కాబోమని, అంతకంటే ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నామని టెస్లా ప్రతినిధులు చెప్పారని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. `మీరు కార్ల గురించి మాట్లాడారు. ఇంధనం గురించి, మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. సంప్రదింపుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి` అని టెస్లా ప్రతినిధులతో తాను చెప్పినట్లు తెలిపారు. దీనిపై స్పందించడానికి టెస్లా తక్షణం అందుబాటులోకి రాలేదు.
టెస్లా యాజమాన్యం గతేడాది చివరి వరకు దిగుమతి కార్లపై సుంకం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కానీ, భారత్లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లా ప్రతినిధులకు కేంద్రం తేల్చి చెప్పడంతో సంప్రదింపుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో ఎంటర్ కావడానికి టెస్లా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. అమెరికా తర్వాత చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. జర్మనీలోని బ్రాండెన్బర్గ్లోనూ మరో యూనిట్ ఉంది.