Tesla | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో వచ్చే ఏడాది కార్ల తయారీ ప్రారంభించనున్నదని తెలుస్తున్నది. సామాన్యులకు అందుబాటు ధరలో ‘మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్’ ఉత్పత్తి చేయాలని టెస్లా భావిస్తున్నది. భారత్లో ‘రెడ్వుడ్ (Redwood)’ అనే పేరుతో కంపాక్ట్ క్రాస్ఓవర్ కారును ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.
భవిష్యత్ తరం కస్టమర్లకు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సీలు తయారు చేయాలని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భావిస్తున్నారు. వీటిల్లో 25 వేల డాలర్ల విలువైన ఎంట్రీ లెవల్ కారు కూడా ఉంటుంది. చైనాకు చెందిన బీవైడీ తయారు చేసే అధిక ధరలతో కూడిన ఈవీ కార్ల కంటే పెట్రోల్ వేరియంట్ కార్లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని టెస్లా యాజమాన్యం భావిస్తున్నది. ఇదిలా ఉంటే 2023లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా టెస్లాను చైనా ‘బీవైడీ’ దాటేసింది.
2020లోనే 25వేల డాలర్ల ధరకు కారు తయారు చేస్తానని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. తర్వాత తన హామీని పక్కన బెట్టారు. తర్వాత అమెరికాలో ‘మోడల్3’ సెడాన్ కారు ధర 38,990 పలుకుతున్నది. ద్రవ్యోల్బణం ప్రభావంతో గతేడాది అమెరికా సహా పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు భారీగా పెంచేయడంతో కన్జూమర్ల గిరాకీపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు ‘రెడ్ వుడ్’ మోడల్ తయారీకి టెస్లా బిడ్లను ఆహ్వానించింది. తొలి దశలో వారానికి 10 వేల కార్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ఈ అంశంపై స్పందించడానికి టెస్లా యాజమాన్యం నిరాకరించింది.