Term Insurance | ప్రస్తుతం కుర్రాళ్లు ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసినా.. స్థిరమైన ఉద్యోగాల్లో చేరాకే పెండ్లి చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు వైవాహిక జీవితంలో అడుగు పెట్టేనాటికి 30 ఏండ్లకు చేరుకుంటున్నారు. ఆ వెంటనే పిల్లలను కన్నా.. వారు పెరిగి 20 ఏండ్లకు చేరుకుని ఉన్నత విద్యాకోర్సుల్లో చేరే నాటికి తల్లిదండ్రులు 50 ఏండ్ల వయస్కులు అవుతున్నారు. అప్పుడు తల్లిదండ్రులపై బాధ్యతలు పెరుగుతున్నాయి. పిల్లల ఉన్నత విద్యాభ్యాసంతోపాటు అమ్మాయిలైతే పెండ్లి చేయాల్సి ఉంటుంది.
పెండ్లిండ్లు, ఉన్నత విద్యా కోర్సుల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టినా.. సరిపోకపోవచ్చు. అదనంగా మరికొంత సొమ్ము అవసరం కావచ్చు. స్థిరమైన ఉద్యోగంలో ఉన్నా ఇంటి రుణం తీసుకుంటే నెలవారీ రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు కుటుంబ యజమాని తన పేరిట తీసుకున్న జీవిత బీమా పాలసీ మెచ్యూర్ అయిపోతుంది. 50 ఏండ్ల వయస్సులో పెరిగిన ఖర్చులు, కుటుంబ అవసరాల రీత్యా అంత పెద్ద మొత్తం ప్రీమియంతో జీవిత బీమా పాలసీ తీసుకోవడం కాస్త ఇబ్బందికరమే.
ఇటువంటి తరుణంలో టర్మ్ బీమా పాలసీలకు ప్రాధాన్యం పెరిగింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే బీమా పథకాలే టర్మ్ పాలసీలు. కుటుంబ నిర్వహణలో కీలకమైన యజమాని దురదృష్టవశాత్తు మరణిస్తే.. సదరు కుటుంబానికి అండగా నిలిచేందుకు బీమా సంస్థలు ఈ టర్మ్ పాలసీలు రూపొందించాయి.
తమ కుటుంబ సభ్యుల జీవనశైలిని బట్టి కుటుంబ యజమాని తన వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు రిటర్న్స్ వచ్చేలా టర్మ్ పాలసీ తీసుకోవాలి. 60 ఏండ్ల మధ్య వయస్సు వరకు టర్మ్ పాలసీ కొనసాగించాలి. ఒకవేళ ఏదైనా దురదృష్టకర ఘటన జరిగినా యజమాని తర్వాత స్థానంలో ఉండే వారికి కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా టర్మ్ పాలసీ రిటర్న్స్ అందుతాయి. కనుక ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభంలోనే టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే కుటుంబానికి శ్రేయస్కరంగా ఉంటుందని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.