న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సింగపూర్కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ టెమ్సెక్..మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ను హస్తగతం చేసుకోబోతున్నది. మరో 41 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. దీంతో సంస్థలో ప్రస్తుతం టెమ్సెక్కు 18 శాతం వాటా ఉండగా..వాటా కొనుగోలు అనంతరం ఈ వాటా 59 శాతానికి చేరుకోనున్నది. దేశీయ హెల్త్కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ఒప్పందం కానుండటం విశేషం. బెంగళూరు కేంద్రంగా ఆరోగ్య సేవలు అందిస్తున్న మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్కు దేశవ్యాప్తంగా 16 నగరాల్లో 29 ఆసుపత్రులను నిర్వహిస్తున్నది. వీటి పడకగదుల కెపాసిటీ 8,300. మణిపాల్ ఫౌండర్ రంజన్ పై కుటుంబానికి చెందిన వాటాతోపాటు టీపీజీ, ఎన్ఐఐఎఫ్కి ఉన్న వాటాను టెమ్సెక్ కొనుగోలు చేయబోతున్నది. ఆర్థిక వివరాలు మాత్రం కంపెనీ వర్గాలు వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల అంచనామేరకు రూ.16 వేల కోట్ల స్థాయిలో ఉంటుందని వెల్లడించారు. మణిపాల్లో పాయ్ కుటుంబ సభ్యుల వాటా 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గనున్నది.