హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎగుమతులను బలోపేతం చేసేందుకు నేటి(మంగళవారం) నుంచి రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్(ఆర్బీఎస్ఎం)ను టీ-హబ్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీటీపీసీ) ఎండీ విష్ణువర్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారంతో ముగియనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ర్టాన్ని అంతర్జాతీయ వాణిజ్యంలో బలమైన కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
ర్యాంప్ కార్యక్రమం కింద చేపట్టే ఈ ఈవెంట్తో ఎంఎస్ఎంఈల పోటీ సామర్థ్యాన్ని పెంచడం, మార్కెట్ అవకాశాలను మరింత విస్తరించడం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడం, వ్యాపార వృద్ధికి సహకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఎస్ఎం ద్వారా టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, వ్యవసాయం, ప్రాసెసింగ్ ఫుడ్ రంగాల్లో ఉన్న స్థానిక ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ కొనుగోలుదారులతో కలిపే వేదికను కల్పించనున్నట్టు తెలిపారు.