హైదరాబాద్, జూన్ 24 : రాష్ర్టానికి చెందిన పలు కార్పొరేట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్నకు చెందిన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన 2025 బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితాలో తెలంగాణ నుంచి 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితా విడుదలైనప్పటీ నుంచి ఇప్పటి వరకు మరో తొమ్మిది సంస్థలు చోటు దక్కించుకోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ దిగ్గజాల నికర విలువ రూ.12.1 లక్షల కోట్లుగా నమోదైంది. 2021లో నమోదైన రూ.5.2 లక్షల కోట్ల కంపెనీల విలువతో పోలిస్తే ఇది 75 శాతం అధికమని పేర్కొంది.
అలాగే ఈ జాబితాలో దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన దివీస్ ల్యాబ్ రాష్ట్ర జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.7 లక్షల కోట్లు. అలాగే ఆ తర్వాత స్థానాల్లో డాక్టర్ రెడ్డీస్ రూ.1.1 లక్షల కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ.83,800 కోట్లతో నిలిచాయి. గత ఐదేండ్లలో హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న కంపెనీలు ప్రతిరోజూ దాదాపు రూ.283 కోట్ల సంపదను పోగేశాయి. ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థలను మినహాయించి ఈ జాబితాను రూపొందించింది. ఏప్రిల్ 30, 2026 నాటికి రూ.10,230 కోట్లు(1.1 బిలియన్ డాలర్లు) కంటే అధిక విలువ కలిగి సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం.
