హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ మొబిలిటీ (టీ-ఎయిమ్) గ్రాండ్ చాలెంజ్ను ప్రారంభించింది. రోడ్లపై గుంతలను గుర్తించడంతో పాటు వాటిని వర్గీకరించి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కి సహాయం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను వినియోగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఏఐ మిషన్ (టీ-ఎయిమ్), క్యాప్ జెమిని భాగస్వామ్యంతో మొబిలిటీ గ్రాండ్ చాలెంజ్ను నిర్వహిస్తున్నారు.
చాలెంజ్లో భాగంగా ప్రత్యక్ష (లైవ్), పాత వీడియో ఫీడ్లను ఉపయోగించి జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతల తీవ్రతలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ… ఆవిష్కరణల ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, ఆవిష్కర్తలు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వం తరపున టీ ఎయిమ్ ఈ చొరవ తీసుకొని గ్రాండ్ చాలెంజ్ను నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీకి ఎంతో కీలకమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు సమాజానికి మేలు చేస్తుందన్నారు. క్యాప్ జెమిని వైస్ ప్రెసిడెంట్, సీఎస్ఆర్ ప్రతినిధి అనురాగ్ ప్రతాప్ మాట్లాడుతూ… ఒక వైవిధ్యమైన ప్రాజెక్టు చేపట్టేందుకు టీ ఎయిమ్తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
ఇలాంటి ప్రాజెక్టు ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై గుంతలను గుర్తించడమే కాకుండా, మునుముందు దేశ వ్యాప్తంగా ఉన్న రోడ్లపై గుంతలను గుర్తించేందుకు సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. రహదారులను ఉన్న గుంతలను గుర్తించి వాటికి మరమత్తులు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, ఎంపిక చేసిన విజేతకు రూ.20 లక్షల వరకు ఇచ్చి ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.