న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు కీలక రంగమైన టెలికం వెర్టికల్ నుంచి ఆదాయం గణనీయంగా తగ్గడంతో నిరుత్సాహక ఫలితాలు వెల్లడించింది. 2023-24 క్యూ3లో కంపెనీ లాభం అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 61 శాతం క్షీణించి రూ.510 కోట్లకు తగ్గింది. ఆదాయం సైతం 5 శాతం తగ్గుదలతో రూ.13,101 కోట్ల వద్ద నిలిచింది. మార్కెట్ అంచనాలకంటే లాభం తగ్గినప్పటికీ, ఆదాయం పెరిగింది. అలాగే క్యూ2తో పోలిస్తే ఆదాయం 3.2 శాతం, నికరలాభం 1.8 శాతం చొప్పున మెరుగుపడింది. అయితే కంపెనీ సాధించిన కొత్త కాంట్రాక్టులు క్యూ2కంటే క్యూ3లో 640 మిలియన్ డాలర్ల నుంచి 381 మిలియన్ డాలర్లకు తగ్గాయి. టెక్ మహీంద్రాకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే టెలికం, మీడియా వెర్టికల్స్ ఆదాయం 2022-23 క్యూ3తో పోలిస్తే 13.4 శాతం పడిపోయింది. త్రైమాసికంవారీగా ఈ తగ్గుదల 0.3 శాతం. టెక్నాలజీ వెర్టికల్ ఆదాయం 3 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల వెర్టికల్ ఆదాయం 8 శాతం చొప్పున తగ్గాయి. 2023 డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఇబిటా మార్జిన్ 12 శాతం నుంచి 5.4 శాతానికి క్షీణించగా, త్రైమాసికంవారిగా 70 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. కంపెనీ నగదు నిల్వలు రూ.6,515 కోట్ల నుంచి రూ.7,012 కోట్లకు పెరిగాయి.
క్యాంపస్లకు వెళ్తాం
ఇతర ఐటీ కంపెనీల్లానే టెక్ మహీంద్రా నుంచి కూడా ఉద్యోగుల వలసలు తగ్గాయి. క్యూ3లో వలసల రేటు 10 శాతానికి దిగింది. క్యూ2లో ఇది 11 శాతం. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా 4 వేలకుపైగా తగ్గి 1,46,250కు చేరింది. బీపీఎం విభాగం కార్యకలాపాలు తగ్గినందున, ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ఏర్పడిందని కంపెనీ కొత్త సీఈవో మిలింద్ జోషి చెప్పారు. ఈ ఏడాది కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరుపుతుందని, ఫ్రెషర్స్ను తీసుకుంటామని వెల్లడించారు.