న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.505.3 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,299.2 కోట్ల లాభంతో పోలిస్తే 61 శాతం క్షీణత కనబరిచింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.13,129.5 కోట్ల నుంచి రూ.12,864 కోట్లకు పడిపోయింది. టెలికం, కమ్యూనికేషన్, ఒప్పందాలు మరింత ఆలస్యం కావడం వల్లనే లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. ఆర్థిక కంపెనీ ఆదాయంలో కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్(సీఎంఈ) వాటా 40 శాతంగా ఉన్నది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 4.7 శాతంగా ఉండగా, గత త్రైమాసికంలో నమోదైన 6.8 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. గత త్రైమాసికంలో సంస్థ 640 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ ప్రతిషేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. సీఎంఈ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరకపోవడంతో సంస్థ ఇతర రంగాలపై దృష్టి సారించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు హెల్త్కేర్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ సీఎఫ్వో రోహిత్ ఆనంద్ తెలిపారు. డిసెంబర్ 19న కంపెనీ ప్రస్తుత సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ స్థానంలో మోహిత్ జోషి నియమితులయ్యారు.