న్యూయార్క్ : ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఉక్రెయిన్ యుద్ధం, ధరల మంట, ఆర్ధిక మందగమనం మాంద్యానికి దారి తీస్తాయనే ఆందోళనతో అమెరికన్ టెక్ దిగ్గజాలు గత మూడు నెలలుగా ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి.
జులైలో 64 ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు సిబ్బందిపై వేటు వేయగా జులైలో లేఆఫ్ల సంఖ్య 32,000కు చేరింది. నెట్ఫ్లిక్స్, షాపిఫై, కాయిన్బేస్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు వందలాది మందిని తొలగించాయని క్రంచ్బేస్ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ప్రతి వారం మూకుమ్మడి లేఆఫ్లు చోటుచేసకుంటుండగా ఏ ఒక్క ఉద్యోగం కుదురుగా లేదని, 2022 ఉద్యోగులకు మరో ప్రతికూల ఏడాదిగా నిలవనుందని టెక్ ఎనలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన కారణం లేకుండానే పెద్దసంఖ్యలో ఉద్యోగులను సాగనంపుతున్నారు. కొన్ని కంపెనీలు నియామక ప్రక్రియను నిలిపివేశామని ప్రకటించగా మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం షాపిఫై గత నెలలో వేయి మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగులను పెద్దసంఖ్యలో విధుల నుంచి తొలగిస్తున్నారు. ఇక ట్విట్టర్ తమ టాలెంట్ ఎక్విజిషన్ టీమ్లో 30 శాతం మందిని తొలగించిందని వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సైతం తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మొత్తం సిబ్బందిలో 1 శాతం మందిని తగ్గించింది. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ పేరుతో ఉద్యోగుల లేఆఫ్కు టిక్టాక్ సిద్ధమైందనే వార్తలు సిబ్బందిలో గుబులు రేపుతున్నాయి. సబ్స్క్రైబర్ల సంఖ్య పడిపోవడంతో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇటీవల 450 మంది ఉద్యోగులను సాగనంపింది.