న్యూఢిల్లీ: మదుపర్ల కోసం తపాలా శాఖ ఆకర్షణీయ మదుపు పథకాలను అమలు చేస్తున్నది. అయితే, బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇతర పొదుపు పథకాల మాదిరిగానే పోస్టాఫీసు మదుపు పథకాలకు ఆదాయం పన్ను చట్టం నిబంధనలు అమలవుతాయి. ఇది పీపీఎఫ్ పథకానికి కూడా వర్తిస్తుంది.
మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన మదుపర్లు ఆయా పథకాల నుంచి నగదు విత్ డ్రాయల్స్పై తపాలాశాఖ తాజాగా నిబంధనలను రూపొందించింది. రూ. 20 లక్షలకు పైగా విత్ డ్రాయల్స్ మీద వసూలు చేసే టీడీఎస్ ఎంతో తెలియజేసింది.
ఇందుకోసం ఆదాయం పన్ను చట్టంలోని 194ఎన్ సెక్షన్ను కొత్తగా చేర్చారు. దీని ప్రకారం గత మూడేండ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని మదుపర్లు చేసే విత్ డ్రాయల్స్మీద టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
ఈ పోస్టాఫీసు పథకాల విత్ డ్రాయల్స్ మీద టీడీఎస్ డిడక్షన్ నిబంధనలేమిటో చూద్దామా..
ఐటీఆర్ ఫైల్ చేయని వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల నుంచి రూ. కోటి లోపు విత్ డ్రాయల్ చేస్తే రెండు శాతం టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటారు. రూ.కోటి దాటిన విత్ డ్రాయల్స్ మీద ఐదు శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.
మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా.. అయితే టీడీఎస్ రూల్స్ విభిన్నంగా ఉంటాయి. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. కోటికి పైగా విత్ డ్రా చేసుకున్నారా.. దానిపై రెండు శాతం టీడీఎస్ చెల్లించాలి.
సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సీఈపీటీ) సొల్యూషన్ ప్రొవైడర్గా పోస్టాఫీసుల్లో మదుపు పథకాల నుంచి టీడీఎస్ ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తుంది. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2020 డిసెంబర్ నెలాఖరు వరకు అటువంటి డిపాజిటర్ల వివరాలను సీఈపీటీ గుర్తించింది.
ఆయా మదుపర్ల వివరాలను సంబంధిత సర్కిల్ పోస్టాఫీస్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్లకు సీఈపీటీ తెలియజేస్తుంది. ఆయా ఖాతాదారుల నుంచి డిడక్ట్ చేయాల్సిన టీడీఎస్ వివరాలపై నివేదిక సమర్పిస్తుంది.
సదరు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ ఇన్చార్జి.. ఖాతాదారులు జమ చేసిన పోస్టాఫీసుకు సీఈపీటీ నివేదికను ఫార్వర్డ్ చేస్తారు. ఈ నివేదికకు అనుగుణంగా సదరు ఖాతా దారుల నుంచి ఆ పోస్ట్ మాస్టర్.. టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. ఈ విషయమై ఆ ఖాతాదారుకు రాతపూర్వకంగా సమాచారం ఇస్తారు.
సంబంధిత పోస్టాఫీసు మాస్టర్.. అలా డిడక్ట్ చేసిన టీడీఎస్ ఓచర్లు, సేవింగ్స్ ఖాతాల ఓచర్లను హెడ్ పోస్టాఫీసుకు తెలుపుతారు. నిబంధనలను అనుగుణంగా టీడీఎస్ డిడక్ట్ చేయకుంటే ఆ పోస్ట్ మాస్టర్దే బాధ్యత. టీడీఎస్ డిడక్ట్ చేయకుంటే అతడిపై పెనాల్టీ విధిస్తారు.