న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏ పద్ధతిని అనురిస్తారన్న అంశమై ఉద్యోగుల ప్రాధాన్యతను యాజమాన్యాలు తీసుకోవాలని, అటుతర్వాతే ఆ విధానానికి అనుగుణంగా శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేయాలని కంపెనీల యాజమాన్యాలకు అదాయపు పన్ను శాఖ సూచించింది. ఒకవేళ ఉద్యోగి తన ఆప్షన్ను యాజమాన్యానికి తెలియపర్చకపోతే, కొత్త ట్యాక్స్ పద్ధతి ప్రకారమే టీడీఎస్ను కట్ చేయాలని సీబీడీటీ కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతం నుంచి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కోతపై సీబీడీటీ తాజాగా వివరణ ఇచ్చింది.
పాత లేదా కొత్త ఐటీ విధానాల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకునే సౌలభ్యం ఉంది. పాత పద్ధతిలో వివిధ సెక్షన్లు కింద పొదుపు, బీమా, పీఎఫ్, గృహ రుణంపై చెల్లించిన వడ్డీ తదితరాలకు మినహాయింపులు లభిస్తాయి. దీనిలో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ రూ.2.50 లక్షలుకాగా, రూ.5 లక్షల వార్షిక ఆదాయం వరకూ పన్ను ఉండదు. కొత్త ఐటీ పద్ధతిలో రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకూ పన్ను ఉండదు.