రూ.13.5 లక్షల కోట్లకు మార్కెట్ విలువ
నూఢిల్లీ, ఆగస్టు 25: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రికార్డులను తిరగరాస్తున్నది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13.5 లక్షల కోట్లకు చేరుకున్న తొలి ఐటీ సంస్థగా రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఇంతటి మార్కెట్ క్యాప్ కలిగిన దేశీయ సంస్థగా ఉండటం గమనార్హం.
స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి టీసీఎస్ రూ.13,53,667.85 కోట్ల మార్కెట్ విలువ కలిగివున్నది. ఈ నెల 17న రూ.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్కు చేరుకున్న విలువ..మరో వారం రోజుల్లో రూ.50 వేల కోట్ల మేర పెరుగడం విశేషం. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.34 శాతం పెరిగి రూ.3,612.80కి చేరుకున్నది. ఇది కూడా 52 వారాల గరిష్ఠ స్థాయి.
రూ.13,96,135.56 కోట్లతో తొలి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కు చేరువ అయింది టీసీఎస్. ఇదే జోరును కొనసాగిస్తే త్వరలో అతిపెద్ద మార్కెట్ సంస్థగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రికార్డుల నుంచి వెనక్కి
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డులకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న సూచీ బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపలేకపోయింది.
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడగా..ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి మద్దతు లభించినప్పటికీ నష్టాల నుంచి తేరుకోలేకపోయింది. ఇంట్రాడేలో 56,198.13 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్..చివరకు 14.77 పాయింట్లు నష్టపోయి 55,944.21 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 10 పాయింట్లు లాభపడి 16,634.65 వద్ద ముగిసింది.