TCS | తమ సంస్థలో ఉద్యోగుల నియామక ప్రక్రియలో ఎటువంటి ఫ్రాడ్ జరుగలేదని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పేర్కొంది. దీనిపై తమ సంస్థ జరిపిన దర్యాప్తులో ‘ఏ ఒక్క కీలక మేనేజర్ స్థాయి ఎగ్జిక్యూటివ్’ ఈ నియామక ప్రక్రియలో భాగస్వామి కాలేదని స్పష్టం చేసింది. తమ కాంట్రాక్ట్ రీసోర్సెస్ ద్వారా జరిగిన నియామకాల ప్రక్రియపై ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించింది.
‘టీసీఎస్ రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి ఏండ్ల తరబడి ఉద్యోగుల నియామకాలకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. సంస్థ యాజమాన్యానికి ఒక ప్రజా వేగు ఫిర్యాదు చేశారు’ అని మీడియా సంస్థల్లో వార్తలొచ్చాయి. ఉద్యోగాల నియామకం పేరిట రూ.100 కోట్ల మేరకు ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలతో సంబంధం ఉందని భావించిన నలుగురు ఎగ్జిక్యూటివ్లను తొలగించిన టీసీఎస్.. ఈఎస్ చక్రవర్తిని సెలవుపై పంపిందని కూడా వార్తలొచ్చాయి. కానీ ఆర్ఎంజీ ఆధ్వర్యంలో సంస్థ నియామక కార్యక్రమాలు నిర్వహించడం లేదని టీసీఎస్ ఓ ప్రకటన చేసింది.