న్యూఢిల్లీ : ఉద్యోగుల వలసలు అధికం కావడం, సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఏడాది పొడవునా ప్రెషర్స్ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్, పెర్సిస్టెంట్ వంటి కంపెనీలు ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నాయి.నిపుణుల కొరతతో సతమతమవుతున్న ఐటీ రంగం ఈ ఏడాది లక్షకు పైగా ఫ్రెషర్స్ను నియమించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. గత కొన్నేండ్లుగా ట్రైనీల నియామకానికి ఏడాది ఆరంభంలో నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ను నిర్వహిస్తున్న టీసీఎస్ ఈసారి ఏడాది పొడవునా హైరింగ్ చేపట్టేందుకు ప్రతి క్వార్టర్లో ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
ఏడాది అంతటా క్యాంపస్ టాలెంట్ను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ గ్లోబల్ హెడ్ గిరీష్. నందిమఠ్ తెలిపారు. ఇక పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 365 రోజులూ హైరింగ్ యాక్టివిటీ చేపట్టనుందని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ సమీర్ బెండ్రె వెల్లడించారు.
ఫ్రెషర్ల హైరింగ్ ఇక సీజనల్గా చేపట్టే ప్రక్రియగా ఉండబోదని, ఫ్రెషర్ల నియామకాలను పెంచడంతో పాటు ఇన్హౌస్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై తాము దృష్టిసారించామని చెప్పారు. ఉత్పాదకతతో రాజీపడకుండా పనిచేసే వాతావరణం కొనసాగించడంలో డిజిటల్ ప్రపంచం తమకు అందివచ్చిన అవకాశమని అన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారితో నియామకాల ప్రక్రియకు విఘాతం కలగడం కరోనా నుంచి మెరుగైన రికవరీతో ఈ ఏడాది నియామకాల ప్రక్రియ ఊపందుకుందని ఎక్స్ఫెనో సహవ్యవస్ధాపకులు కమల్ కారంత్ పేర్కొన్నారు.