న్యూఢిల్లీ, జూన్ 28: వివిధ అవసరాలకు వినియోగదారులు జరిపే విదేశీ ఖర్చులపై టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) విధింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఒక ఆర్థిక సంవత్సరం రూ. 7 లక్షల వరకూ టీసీఎస్ ఉండదని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఏ ప్రయోజనం కోసం ఖర్చుచేసినా టీసీఎస్ విధించరు. అయితే రూ.7 లక్షలు దాటితే ఆయా లావాదేవీలను బట్టి వివిధ రేట్లలో టీసీఎస్ వర్తిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో చేసే విదేశీ ఖర్చులను లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)లో చేర్చే వరకు వాటిపై టీసీఎస్ విధింపు ఉండదన్నది. కొత్త టీసీఎస్ రేట్లు ఈ అక్టోబర్ 1 నుంచి అమలవుతాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఎల్ఆర్ఎస్ ద్వారా జరిపే విదేశీ చెల్లింపులకు టీసీఎస్ను 5-20 శాతం వరకూ ఈ ఏడాది బడ్జెట్లో పెంచారు. ఈ అధిక రేట్లు జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా, గడువును 3 నెలలు పెంచారు.