న్యూఢిల్లీ, జనవరి 26: అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్లలో భారత్ దిగ్గజం టీసీఎస్ ద్వితీయస్థానాన్ని ఆక్రమించింది. టాప్-25 గ్లోబల్ ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్లో మరో ఐదు భారత కంపెనీలు సైతం చోటు సంపాదించాయి. బ్రాండ్ ఫైనాన్స్ ఐటీ సర్వీసెస్ 2022 రిపోర్ట్ ప్రకారం ఇన్ఫోసిస్ మూడోస్థానానికి చేరగా, విప్రో (7), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (8), టెక్ మహీంద్రా (15), ఎల్ అండ్ టీ టెక్నాలజీస్ (ఎల్టీఐ, 22) ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే బ్రాండ్ విలువను వేగంగా పెంచుకున్న టాప్-10 సంస్థల్లో ఆరు భారత్కు చెందినవే కావడం విశేషం. ఇందులో 80 శాతం వృద్ధితో ఇన్ఫోసిస్.. ప్రపంచంలో అత్యంత వేగంగా బ్రాండ్ విలువను పెంచుకున్నది. ఐర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న యాక్సెంచర్ పటిష్ఠమైన ఐటీ బ్రాండ్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. నాలుగేండ్లుగా ఇదే స్థానాన్ని ఈ కంపెనీ పదిలపర్చుకుంది. దీని బ్రాండ్ విలువ 36.2 బిలియన్ డాలర్లని బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ వెల్లడించింది. యాక్సెంచర్.. ఇండియా నుంచే అత్యధికంగా ఐటీ సర్వీసుల్ని అందిస్తున్నది.
తగ్గిన అమెరికా కంపెనీల బ్రాండ్ విలువ
భారత్కు చెందిన ఐటీ సర్వీసుల బ్రాండ్లు 2020-2022 సంవత్సరాల మధ్య 51 శాతం సగటు వృద్ధిని సాధించగా, అమెరికా ఐటీ కంపెనీల బ్రాండ్ల విలువ ఇదేకాలంలో 7 శాతం తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ ట్రెండ్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా రిమోట్ వర్కింగ్ సంస్కృతి రావడంతో ఇండియాలో ఐటీ సర్వీసుల హబ్లు విస్తరించాయని బ్రాండ్ ఫైనాన్స్ వివరించింది. తాజా జాబితా ప్రకారం టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ రెండేండ్లలో 24 శాతం వృద్ధిచెంది 16.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది దీని స్థానం 3. అమెరికా ఐటీ కంపెనీ ఐబీఎం.. రెండోస్థానం నుంచి నాల్గో స్థానానికి తగ్గింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ గత రెండేండ్లలో 50 శాతం క్షీణించి 10.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ కంపెనీ తన ఐటీ ఇన్ఫ్రా బిజినెస్ విభాగం కిన్డ్రేల్ను వేరుపర్చి ప్రత్యేక సంస్థగా ఏర్పర్చడంతో బ్రాండ్ విలువ పడిపోయినట్లు రిపోర్ట్ పేర్కొంది. 5,6 స్థానాల్లో కాగ్నిజెంట్, క్యాప్జెమినిలు ఉన్నాయి. ఈ ఏడాది జాబితాలో అమెరికా కంపెనీలు ఈపీఏఎం సిస్టమ్స్ (16), థాట్వర్క్స్ (24) స్థానం సంపాదించుకున్నాయి.