TCL | తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చైనా దిగ్గజం టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ రూ.225 కోట్ల పెట్టుబడితో ఓ ప్లాంట్ను తెచ్చేందుకు సిద్ధమైంది. విదేశాల్లో సంస్థకిదే తొలి వాషింగ్ మెషీన్ల తయారీ కేంద్రం కానుండటం గమనార్హం.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్గా దీన్ని తేనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. దీనికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా హాజరవగా.. ఆయన సమక్షంలో రిసోజెట్, టీసీఎల్ సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు బుధవారం ఆ కంపెనీలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల్ వద్దనున్న ఈ-సిటీలో ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ రానున్నది. ఇక ఈ ప్రపంచ శ్రేణి ప్రాజెక్టులో భాగంగా తొలి దశ కిందే 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్ లిమిటెడ్.. ప్రపంచంలోని అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లో వాషింగ్ మెషీన్లను టీసీఎల్ తయారు చేయబోతుండటం విశేషం. విదేశాల్లో టీసీఎల్కు ఇదే తొలి వాషింగ్ మెషీన్ల తయారీ కేంద్రం కానున్నది మరి. ప్రస్తుతం ఎన్నో దేశాల్లో వాషింగ్ మెషీన్లను అమ్ముతున్న టీసీఎల్.. వాటిని చైనాలోనే తయారు చేస్తున్నది. రావిర్యాల్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే చైనాతోపాటు తెలంగాణ కేంద్రంగా తయారైన టీసీఎల్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లో హల్చల్ చేయనున్నాయి. కాగా, ఈ ప్లాం ట్ను టెలివిజన్లు, ఏసీలు, మైక్రోవేవ్ అవెన్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లు తదితర గృహోపకరణాలను తయారు చేయడానికీ విస్తరించే వీలుందని సంస్థ వర్గాలు చెప్తున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని షెన్జన్ (గ్లోబల్ టెక్నాలజీ హబ్, చైనా సిలికాన్ వ్యాలీ)ఆఫ్ ఇండియాగా మార్చడంలో విశ్రమించబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. టీసీఎల్తో కలిసి రిసోజెట్ విస్తరణ బాట పట్టడం ఆనందంగా ఉందన్న మంత్రి.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని చెప్పారు. ఇక్కడి ప్లాంట్తో టీసీఎల్ మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎంవోయూ కుదుర్చుకున్న ఇరు సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్లాంట్కు అవసరమైన అన్ని రకాల సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను, ఎకోసిస్టమ్ను పరిశీలించేందుకు టీసీఎల్ గ్రూప్ సీఈవో జువాన్ డూతోపాటు ఆ సంస్థ ప్రతినిధుల బృందాన్ని ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రిసోజెట్ సీఈవో గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి, ఇరు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘రాష్ర్టానికి చెందిన సంస్థ రిసోజెట్ కార్యకలాపాలు విస్తరిస్తుండటం గర్వంగా ఉన్నది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న టీసీఎల్కు స్వాగతం. ఈ పెట్టుబడి.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ సామర్థ్యానికి, ఇక్కడున్న అనుకూలతలు, అవకాశాలకు నిదర్శనం. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన ఉత్పాదక రంగానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుండటం కలిసొస్తున్నది ’
-కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి
‘ఈ ప్రతిపాదిత జాయింట్ వెంచర్.. భారతీయ ఎలక్ట్రానిక్స్ విజయగాథను మరింత ఇనుమడింపజేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కృషి చేయగలదు’
-రమీందర్ సింగ్ సోయిన్, రిసోజెట్ ఎండీ