Tesla-Tata | భారత్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ఎంట్రీ ఖాయమైంది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే సెమీ కండక్టర్ చిప్ల తయారీ కోసం టెస్లా.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లలో వాడే సెమీ కండక్టర్ చిప్లను టాటా ఎలక్ట్రానిక్స్ సరఫరా చేయనున్నట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో టెస్లా-టాటా మధ్య ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నెల 22-27 తేదీల మధ్య భారత్ కు ఎలన్ మస్క్ రానున్నారని సమాచారం. ఎలన్ మస్క్ తన పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీతోనూ సమావేశం అవుతారని తెలుస్తున్నది. మస్క్ తన భారత్ పర్యటనలో దేశంలో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని ఎలన్ మస్క్ రెండు దఫాలు కలుసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్, బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నది. ఇందుకోసం భారత్కు టెస్లా ప్రతినిధులు వచ్చి మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఎంపిక చేస్తారని ఈ నెల ప్రారంభంలోనే ఫైనాన్సియల్ టైమ్స్లో వార్తాకథనం ప్రచురితమైంది. ఇందుకోం టెస్లా.. రూ.16 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల (200 లేదా 300 కోట్ల డాలర్లు) పెట్టుబడులను పెట్టనున్నది.
ఇప్పటికే భారత్లో ఆటోమోటివ్ హబ్లుగా పేరొందిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు గల అవకాశాలపై టెస్లా ప్రతినిధుల టీం ఫోకస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్లతోపాటు సెల్ బ్యాటరీ, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్ తయారు చేయాలని టెస్లా యోచిస్తున్నది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అధికారులకు టెస్లా ప్రతిపాదనలు సమర్పించింది.