ముంబై, జనవరి 9: ప్రీమియం కాఫీల విక్రయ సంస్థ టాటా స్టార్బక్స్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 390 స్టోర్లు ఉండగా..2028 నాటికి ఈ సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది. అమెరికాకు చెందిన స్టార్బక్స్తో కలిసి టాటా గ్రూపు..ప్రతి మూడు రోజులకొక స్టోర్ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ముఖ్యంగా ఇప్పటికే మెట్రో నగరాలకు పరిమితమైన సంస్థ..ఇక నుంచి తన వ్యాపారాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించబోతున్నది. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ అవతరించే అవకాశాలు ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. వచ్చే ఐదేండ్లలో స్టోర్ల సంఖ్యను 1,000కి పెంచుకోవడంలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు 8,600కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 71 శాతం ఎగబాకి రూ.1,087 కోట్లకు చేరుకున్నాయి.