Tata Motors | భారత కార్ల మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెందుతున్న సంస్థ టాటా మోటార్స్.. ఒకటి తర్వాత మరొక మైలురాయి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. శుక్రవారం (2023 మార్చి మూడో తేదీ) నాటికి మరో మైలురాయిని దాటింది. శుక్రవారం తన 50 లక్షల కార్ల తయారీ మార్క్ను దాటేసింది. టాటా సన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా 183వ జయంతి సందర్భంగా టాటా మోటార్స్ ఈ మార్క్ను చేరుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా ఉద్యోగులు, కస్టమర్లతో కలిసి సంబురాలు చేసుకున్నారు. కంపెనీ న్యూ ఫర్ఎవర్ రేంజ్ కార్ల గురించి గ్రౌండ్పై `50 లక్షలు` అని రాశారు. ఆ జాబితాలో ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్, టియాగో, టైగోర్, హారియర్, సఫారీ తదితర మోడల్ కార్లు ఉన్నాయి. ఈ సంబురాల్లో భాగంగా కంపెనీ డీలర్షిప్లు, సేల్స్ ఔట్లెట్ల వద్ద సిబ్బందికి ప్రత్యేకంగా దుస్తులు, బహుమతులను టాటా మోటార్స్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
టాటా మోటార్స్ ప్రయాణం పలు ఒడిదొడుకుల మధ్య సాగింది. గత రెండున్నరేండ్లలోనే పది లక్షల కార్లు తయారు చేశామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ & టాటా రేంజ్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి వల్ల సెమీ కండక్టర్ల కొరతతో కార్ల తయారీ గణనీయంగా దెబ్బ తిన్నది. ఇప్పుడిప్పుడే ఉత్పత్తి గాడిలో పడుతున్నది. ప్రతి నూతన మోడల్ కారుతో భారత్ రూపురేఖలే మార్చేస్తామని అన్నారు.
1977లో టాటా మోటార్స్ తన పుణె ప్లాంట్ నుంచి తొలి కమర్షియల్ వెహికల్ రోడ్డు మీదకు తీసుకొచ్చింది. అటుపై 1991లో తొలి ప్యాసింజర్ వెహికల్ టాటా సిర్రాను ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఇండికా కారుకు కస్టమర్ల నుంచి చాలా సానుకూల స్పందన లభించింది. నాటి నుంచి విభిన్న సెగ్మెంట్లలో పలు రకాల మోడల్ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కంపెనీ పోర్ట్ఫోలియోలో సఫారీ, సుమో, ఇండిగో, హారియర్, పంచ్, నెక్సాన్, టియాగో, టైగోర్, నానో, ఆల్ట్రోజ్ వంటి మోడల్ కార్లు తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో టాటా మోటార్స్దే అత్యధిక వాటా.