దేశీయంగా విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో టాటా సన్స్ వారి టాటా మోటార్స్ అనుబంధ ‘టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్’ కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారతీయ పెట్రోలియంతో దేశవ్యాప్తంగా 7,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ పంపుల వద్ద మహారత్న ఎనర్జీ కంపెనీని ఏర్పాటు చేయనున్నది.
దేశవ్యాప్తంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు 21 వేల పెట్రోల్ పంపుల నెట్ వర్క్ ఉన్నాయి. 1.15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు.. అందునా టాటా ఈవీ కార్ల యజమానులు తరుచుగా చార్జింగ్ చేసుకునేందుకు బీపీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద ఈ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. వాహనాల చార్జింగ్ కోసం టాటా ఈవీ కార్ల యజమానుల వద్ద కో-బ్రాండెడ్ ఆర్ఎఫ్ఐడీ కార్డు ద్వారా సౌకర్యవంతమైన చెల్లింపులకు అనుమతి ఇస్తారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 7000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు బీపీసీఎల్ తెలిపింది. ప్రస్తుతం హైవే కారిడార్లపై 90 ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉంది. ప్రధాన రహదారులపై ఇరువైపులా ప్రతి 100 కి.మీలకు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది. దేశవ్యాప్తంగా 30 వేల కిలోమీటర్ల పొడవునా ఈ చార్జింగ్ కారిడార్లు ఉంటాయని బీపీసీఎల్ తెలిపింది.