న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. గడిచిన త్రైమాసికానికిగాను కంపెనీ రూ.4,951 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,450 కోట్ల నష్టంతో పోలిస్తే మరింత పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం రూ.66,406 కోట్ల నుంచి రూ.71,935 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. స్టాండలోన్ విషయానికి వస్తే రూ.181 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
ఆదాయం మాత్రం రూ.6,577 కోట్ల నుంచి రూ.14,874 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. చిప్ల కొరతతోపాటు కరోనా కారణంగా చైనాలో లాక్డౌన్ విధించడంతో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ విక్రయాలు భారీగా పడిపోయాయి. ఫలితంగా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.