Cars Rates Hike | ముడి సరుకు ధరలు, ఇన్పుట్ కాస్ట్ వ్యయం పెరిగిందనే పేరుతో మారుతి సుజుకి, ఆడి కార్ల బాటలోనే టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ ప్రయాణించనున్నాయి. వచ్చే నెలలో తమ కార్లపై ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపాయి.
మారుతి సుజుకితోపాటు విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలు ఆడి, మెర్సిడెస్ బెంజ్ వచ్చే నెలల నుంచి ధరలు పెంచుతామని ఇప్పటికే ప్రకటించాయి. ఆడి యాజమాన్యం మూడు శాతం, మెర్సిడెస్ బెంజ్ ఎంపిక చేసిన మోడళ్లపై రెండు శాతం కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే బుక్ చేసుకుని, వాహన డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వారికి పాత ధరలే వర్తిస్తాయని బెంజ్ పేర్కొంది.
కమొడిటీస్ ధరలు, ముడి సరుకు, ఇతర ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్లో ధరలు పెంచక తప్పదని టాటా మోటార్స్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దేశీయ మార్కెట్లో పంచ్, నెక్సాన్, హారియర్ మోడల్ కార్లను విక్రయిస్తున్నది.
మరో కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కూడా సమీప భవిష్యత్లో కార్ల ధరలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కమొడిటీస్ ధరలు పెరిగిపోవడంతో ఇన్పుట్ కాస్ట్ వ్యయం ప్రభావం తీవ్రంగా ఉందని, భారం తగ్గించుకోవడానికి ఏ మేరకు ధరలు పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు హోండా కార్స్ అధికార ప్రతినిధి చెప్పారు. గత ఆగస్టులో సిటీ, అమేజ్ మోడల్ కార్ల ధరలు పెంచింది.
ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ సైతం జనవరి నుంచి గణనీయంగా కార్ల ధరలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. భారత్ మార్కెట్లో రెనాల్ట్.. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్ కార్లను విక్రయిస్తున్నది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ సహా ఇతర లోహాల ధరలు పెరిగిన నేపథ్యంలోనే ధరల పెరుగుదల నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఆయా కంపెనీ యాజమాన్యాలు ప్రకటించాయి. రవాణా ఛార్జీలు కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి.