Tata Motors | ఎస్యూవీ కార్ల కోసం కొత్తగా పెట్రోల్ పవర్ ట్రైన్ ఇంజిన్ను అభివృద్ధి చేస్తున్నది టాటా మోటార్స్. ఇప్పుడు టాటా ఎస్యూవీ కార్లలో 2-లీటర్ల డీజిల్ ఇంజిన్లనే వాడుతున్నారు. తాము తాజాగా డెవలప్ చేస్తున్న పెట్రోల్ ఇంజిన్ను హారియర్, సఫారీ వంటి మోడల్ కార్లలో వాడతామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. `సరైన దృష్టితో ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ కారు డెవలప్ చేయాల్సి ఉంది. మా ప్రక్రియలో పురోగతి ఉంది. ఈ ఇంజిన్ కెపాసిటీ పెంపునకు పని చేస్తున్నాం. పెట్రోల్ ఇంజిన్ పొందడానికి కొంత దూరం ప్రయాణించాలి. కానీ పెట్రోల్ ఇంజిన్ తయారు చేస్తాం` అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం తమ హారియర్, సఫారీ వంటి 80 శాతం ఎస్యూవీ కార్లలో మెరుగైన టార్క్ పెర్ఫార్మెన్స్ కోసం డీజిల్ పవర్ ట్రైన్ ఇంజిన్లు వాడుతున్నది. తాము తొలుత డీజిల్ పవర్ ట్రైన్ ఇంజిన్ తయారీపైనే ఫోకస్ చేశాం అని శైలేష్ చంద్ర చెప్పారు.
కానీ, ప్రస్తుతం అధిక మొత్తం చెల్లించి పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో 20 శాతం మార్కెట్ వాటాను వదులుకోవద్దనే ఉద్దేశంతో పెట్రోల్ పవర్ ట్రైన్ ఇంజిన్ డెవలప్ చేయడంపై ఫోకస్ చేస్తున్నది టాటా మోటార్స్. అందుకోసం 1.5 – లీటర్ల జీడీఐ (గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజిన్ తయారీలో నిమగ్నం అయ్యాం అని శైలేష్ చంద్ర తెలిపారు.