హైదరాబాద్లో ఒకేరోజు 4 షోరూంలు ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 3: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ తన వ్యాపారాన్ని దక్షిణాదిలో భారీగా విస్తరించింది. శుక్రవారం ఒకేరోజు ఏకంగా 70 అవుట్లెట్లను ప్రారంభించి రికార్డు నెలకొల్పింది. రిటైల్ కస్టమర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఈ స్టోర్లను ఆరంభించినట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. వీటిలో హైదరాబాద్లో నాలుగు షోరూంలను ప్రారంభించిన సంస్థ..బెంగళూరులో 7, చెన్నైలో 5, కొచిలో నాలుగు రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 980కి చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ యూనిట్) రాజన్ అంబా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న వాహనాల్లో దక్షిణాది వాటా 28 శాతానికి పైగా ఉండటంతో ఇక్కడి మార్కెట్లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఒకేసారి 70 అవుట్లెట్లను ఆరంభించినట్లు చెప్పారు.