న్యూఢిల్లీ : టాటా మోటార్స్ టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ లాంఛ్తో సీఎన్జీ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఈ రెండు కార్లకు టాటా డీలర్ల వద్ద బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 19న వీటిని లాంఛ్ చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్ సీఎన్జీ ప్యాసింజర్ సెగ్మెంట్లో పోటీ పడుతుండగా తాజాగా టాటా మోటార్స్ ఈ మార్కెట్లోకి ఎంటరైంది.
ఇక టాటా టిగోర్ సీఎన్జీ ఫీచర్ల విషయానికి వస్తే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 15-ఇంచ్ అల్లాయ్స్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 7 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక టాటా టియాగో సీఎన్జీ హ్యుందాయ్ శాంట్రో, మారుతి సుజుకి వ్యాగనార్కు దీటైన పోటీ ఇవ్వనుండగా టిగోర్ హ్యుందాయ్ ఆరాకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
భారత నగరాల్లో సీఎన్జీ కార్లకు ఏటికేడు గిరాకీ పెరుగుతున్నది. 2019లో 1300 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా ఇప్పుడవి 293 నగరాల్లో ఏకంగా 3500కు ఎగబాకాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) గణాంకాలు వెల్లడించాయి. 2025 నాటికి ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్య 6000కు చేరుకోనుంది.