న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఐఫోన్లు తయారుచేసే తొలి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది. ఇప్పటివరకూ దేశంలో యాపిల్ ఫోన్లను విదేశీ కంపెనీల సబ్సిడరీలు ఉత్పత్తి చేస్తుండగా, అందులో ఒకటైన విస్ట్రాన్ యూనిట్ను టాటా గ్రూప్ రూ.1,000 కోట్లకు కొంటున్నది. టాటాలకు యూనిట్ను విక్రయించాలన్న ప్రతిపాదనను విస్ట్రాన్ బోర్డు ఆమోదించింది.
ఈ మేరకు విస్ట్రాన్ ఇన్ఫోకామ్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించడానికి తమ సబ్సిడరీలైన ఎస్ఎంఎస్ ఇన్ఫోకామ్ సింగపూర్, విస్ట్రాన్ హాంకాంగ్లు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకాలు చేయనున్నట్టు విస్ట్రాన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఇరు పక్షాలు సంతకాలు చేసిన తర్వాత అవసరమైన అనుమతుల్ని కోరతామని పేర్కొంది.