Tata Sons | టాటా సన్స్ (Tata Sons) గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.30 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ఈ సంస్థ ఈ మార్క్ను చేరుకోవడం ఇదే తొలిసారి. గత ఏడాది కాలంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ షేర్లు పుంజుకోవడం వల్లే టాటా సన్స్ ఈ మైలురాయిని దాటేసింది.
ఈ నెల ప్రారంభం నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్క్రిప్ట్ తొమ్మిది శాతానికి పైగా పుంజుకున్నది. టాటా మోటార్స్ 20 శాతానికి పైగా, టాటా పవర్ 18 శాతం, ఇండియన్ హోటల్స్ 16 శాతం పెరిగాయి. దీంతో దేశీయ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన 24 టాటా గ్రూప్ సంస్థల షేర్లు పెరిగాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తోపాటు యూరోప్ అసిస్టెన్స్ సంస్థతో డీల్ కుదిరిందని టీసీఎస్ సోమవారం దేశీయ స్టాక్ మార్కె్ట్లలో ప్రకటించడంతో మంగళవారం ఒక్కరోజే షేర్ నాలుగు శాతానికి పైగా చేరుకున్నది. దీంతో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.13 లక్షల కోట్లకు చేరుకున్నది.