న్యూఢిల్లీ, జూన్ 18: కస్టమ్స్ సుంకం పెంపు నేపథ్యంలో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. దాదాపు 70 శాతం క్షీణించి 25-30 టన్నులకు పరిమితమైనట్టు గురువారం సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విదేశాల నుంచి దేశంలోకి వచ్చే పసిడి, వెండిపై గత నెల 13న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి మోదీ సర్కార్ పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇది 6 శాతంగానే ఉండేది. ఈ క్రమంలోనే గడిచిన నెల రోజుల్లో ఆయా దేశాల నుంచి భారత్కు దిగుమతైన పుత్తడి 25-30 టన్నులుగానే నమోదైనట్టు సదరు అధికారి చెప్పారు. మునుపు ఇది 75-100 టన్నులుగా ఉండేదని గుర్తుచేశారు.
బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. గురువారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.960 దిగి రూ.1,53,440గా ఉన్నది. వెండి ధర రూ.6,660 పడిపోయి రూ.2,48,740కి పరిమితమైంది. ఇక హైదరాబాద్లో తులం 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) బంగారం విలువ రూ.1,450 దిగి రూ.1,37,050గా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,266.47 డాలర్లు, సిల్వర్ 68.17 డాలర్లు పలికింది.